

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్మూజ్ జలసంధిను తాత్కాలికంగా తెరిచిన ఇరాన్, కొద్ది సమయంలోనే మళ్లీ మూసివేసింది. తమపై కొనసాగుతున్న ఆంక్షలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే అమెరికాతో జరగాల్సిన తదుపరి చర్చల్లో పాల్గొనబోమని కూడా సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామాల మధ్య కొన్ని వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇందులో రెండు భారత నౌకలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఒక నౌక సురక్షితంగా ముందుకు సాగగా, మరో నౌకపై దాడి జరిగి స్వల్ప నష్టం కలిగింది. ఈ ఘటనలతో పలు నౌకలు వెనక్కి మళ్లగా, మరికొన్ని జలసంధి వద్దే ఆగిపోయాయి.
ఈ ఘటన పై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు తమ చర్యలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా, తమ సముద్ర భద్రతను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ నాయకత్వం హెచ్చరించింది. ఇదే సమయంలో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి అసిం మునీర్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగించారు. అమెరికా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఇరాన్ తెలిపింది. అయితే ముఖ్య అంశాలపై స్పష్టత రాకపోవడంతో చర్చలు కష్టంగా మారుతున్నాయి. మరోవైపు, అమెరికా తన సైనిక ఉనికిని పెంచుతూ USS Gerald R. Ford సహా నౌకాదళాన్ని ఆ ప్రాంతంలో మోహరించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!