

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల తనిఖీల ప్రక్రియ పై వివాదాస్పద ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేఎన్టీయూహెచ్కు చెందిన కొందరు ఆచార్యులు తనిఖీల సమయంలో భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. ముఖ్యంగా ఒక కీలక పదవిలో ఉన్న ఆచార్యుడు తనిఖీకి వస్తే రూ.4 లక్షల వరకు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వకపోతే నిబంధనలు పాటించలేదని నివేదికలో పేర్కొని అనుబంధ గుర్తింపు పై ప్రభావం చూపుతారని భయంతో యాజమాన్యాలు డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు కాలేజీల మౌలిక వసతులను పరిశీలించేందుకు ఎఫ్ఎఫ్సీ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ)లను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన తనిఖీలు 25 వరకు కొనసాగనున్నాయి.
గతంలో కొందరు సభ్యులు రూ.1-2 లక్షల వరకు తీసుకునేవారన్న ఆరోపణలు ఉండగా, ఈసారి డిమాండ్ మరింత పెరిగిందని ప్రచారం ఉంది. ముఖ్యంగా పెద్ద కాలేజీల తనిఖీలను ఒకే బృందానికి అప్పగించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కీసర ప్రాంతం, నాగోలు పరిసరాల్లోని కొన్ని కాలేజీల నుంచి పెద్ద మొత్తాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అందరూ ఆచార్యులు ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదని, కొందరు మాత్రం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరోవైపు, తనిఖీలు పూర్తయిన తరువాత కొన్ని కాలేజీలు అధ్యాపకులను తొలగిస్తున్నాయి. హైదరాబాద్లోని ఒక ప్రముఖ విద్యాసంస్థ దాదాపు 300 మంది లెక్చరర్లను తొలగించినట్లు సమాచారం. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి స్పందించారు. ఆయన ఈ అంశాన్ని జేఎన్టీయూహెచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిజానిజాలు నిర్ధారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!