

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ రంగాల్లో సంస్కరణలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టికి సంస్కరణలే పునాదిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో విజన్ 2020 ద్వారా చేపట్టిన చర్యల ఫలితాలే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేగవంతమైన వ్యాపార అనుమతులు, వేగంగా పాలన అందించే విధానాలతో సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు.
ముంబైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, త్వరగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.
రాజధాని అమరావతిని భవిష్యత్ నగరంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జనాభా నిర్వహణ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కీలకమని, సమాజంలోని ప్రతి వర్గానికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వివరించారు.
విద్యుత్ రంగంలో కూడా సంస్కరణలు చేపట్టి పునరుత్పాదక శక్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలకు లాభాలు అందుతాయని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ నిల్వ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమోనియా వంటి రంగాల్లో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఈ నెలలో శంకుస్థాపన జరగనుందని తెలిపారు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!