

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించడంతో సంస్థలో పనిచేస్తున్న 37,360 మందికి లబ్ధి కలగనుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఆ తేదీ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కూడా ప్రయోజనం అందుతుంది. 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కండక్టర్లకు సుమారు రూ.4,000 నుంచి రూ.15,000 వరకు, డ్రైవర్లకు రూ.4,000 నుంచి రూ.17,000 వరకు జీతాలు పెరగనున్నట్లు కార్మిక వర్గాలు వెల్లడించాయి.
ఈ వేతన సవరణతో సంస్థపై భారీ ఆర్థిక భారం పడనుంది. 2021 నుంచి అమలు చేయాల్సి ఉండటంతో ఐదు సంవత్సరాల బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే రూ.2,178 కోట్లకు పైగా, విశ్రాంత ఉద్యోగులకు సుమారు రూ.230 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మొత్తంగా రూ.2,400 కోట్లకు పైగా భారం పడనుందని అధికారులు తెలిపారు. అదనంగా ప్రతి నెలా వేతనాల కోసం రూ.34.6 కోట్లు ఎక్కువగా ఖర్చవుతుండగా, సంవత్సరానికి ఇది రూ.415 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా.
బకాయిల చెల్లింపులో భాగంగా ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికి పదవీ విరమణ సమయంలో చెల్లిస్తారు. వేతన సవరణ అమలులో భాగంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకోనున్నారు. ఇంక్రిమెంట్ తేదీలను నిర్ణయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మొత్తం ప్రక్రియ ఆరు వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!