

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐప్యాక్’పై జరుగుతున్న ఈడీ విచారణలో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవడం సరైంది కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని పేర్కొంది.
బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుపై ఈడీ గత కొంతకాలంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే, ఈ దర్యాప్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తారని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కూడా ఊహించి ఉండరని వ్యాఖ్యానించింది. ‘‘ఇది రాష్ట్రం-కేంద్రం మధ్య వివాదం కాదు. ఒక ముఖ్యమంత్రి నేరుగా విచారణలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదు. దీనిని రాజకీయ వివాదంగా మార్చకండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారులతో కలిసి అక్కడికి వెళ్లినట్లు కోర్టుకు తెలిపారు. 2021 నుంచి టీఎంసీ పార్టీకి ఐప్యాక్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!