

పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) సమావేశంలో జరిగిన ప్రోటోకాల్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పదేపదే వివాదాలు ఎందుకని ప్రశ్నిస్తూ, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్మకు హితవు పలికారు. స్థానిక సమస్యలు ఉంటే పార్టీ అధిష్ఠానానికి లేదా ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలని, వాటిని ప్రజల్లో వివాదంగా మార్చకూడదని సూచించారు. ఇలాంటి ఘటనలు పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
సమావేశంలో సీఎం ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలై, మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో వర్మ మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని నియంత్రించేందుకు చంద్రబాబు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. కూటమి ఐక్యత కోసం క్రమశిక్షణ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!