

పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు అనాథ పిల్లల బాధ్యతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా స్వీకరించి మరోసారి తన ప్రజాసేవను చాటుకున్నారు. రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయిన ఈ సోదరులు ఆశ్రయం లేక, ఆర్థిక మద్దతు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు.
తన జీతం నుంచి నెలకు ఒక్కో పిల్లకు రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, వారికి శాశ్వత నివాస గృహం నిర్మించాలని అధికారులను సూచించారు. తాత్కాలిక సహాయంతోనే కాదు, భవిష్యత్తు భద్రత కూడా ముఖ్యమని భావించిన పవన్ కళ్యాణ్, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వారికి ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్కు అప్పగించారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరిని కూడా ఆ జాబితాలో చేర్చి మానవత్వంతో కూడిన నాయకుడిగా మరోసారి నిలిచారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!