

జనాభా లెక్కలు-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఆదివారం నుంచి ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మే 10 వరకు వెబ్సైట్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఈ సేవ అందుబాటులో ఉంటుంది. స్వీయ గణన పూర్తి చేసిన వారికి రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. ఇంటికి వచ్చే జనగణన అధికారి ఆ నంబర్ ఆధారంగా వివరాలను ధృవీకరిస్తారు. స్వీయ గణన చేయని వారు అయితే అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారు.
జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో 27 ప్రశ్నలకు స్వీయ గణనలోనే సమాధానాలు ఇవ్వవచ్చు. మిగిలిన ప్రశ్నలను జనగణన అధికారి నమోదు చేస్తారు. ఇంటి వివరాలు, సౌకర్యాలు, కులం వంటి అంశాలపై మాత్రమే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తులు, ఆధార్ వంటి వివరాలు అవసరం ఉండవు. ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే జనగణన నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా తమ ప్రస్తుత నివాసంలోనే నమోదు కావాలి.
మే 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారు. మొదటి దశలో భవనాలకు నంబర్లు కేటాయిస్తారు. రెండో దశలో వ్యక్తుల వారీగా పూర్తి సమాచారం నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో కొనసాగుతుంది. రహదారులపై నివసించే నిరాశ్రయుల వివరాలు కూడా ప్రత్యేకంగా సేకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఎన్యూమరేటర్లు ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. ప్రజలు సరైన వివరాలు అందించడం ద్వారా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు.






.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!