

తిరుపతి: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(తితిదే) భక్తుల కోసం ముఖ్యమైన సూచనలు విడుదల చేసింది. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30, 2025 నుంచి జనవరి 8, 2026 వరకు నిర్వహించనున్నట్లు తితిదే స్పష్టం చేసింది.
డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో ఈ-డిప్ విధానం ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అనుమతించబడుతుంది. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అనుగుణంగా మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాలని తితిదే సూచించింది.
అదేవిధంగా, తితిదే ప్రజా సంబంధాల విభాగం, SVBC, సోషల్ మీడియా ద్వారా అందించే భక్తుల రద్దీ సమాచారాన్ని గమనించి, టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి జనవరి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని కోరింది.
ఈ పదిరోజుల కాలంలో ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, విఐపి బ్రేక్ దర్శనాలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, NRI, డిఫెన్సు కోటా వంటి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. సిఫార్సు లేఖలను కూడా ఈ కాలంలో స్వీకరించబోమని స్పష్టం చేసింది.
అన్ని వర్గాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి, భక్తులు సంయమనం పాటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుని తితిదేకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!