

విద్యే సమాజ అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనకు అత్యంత ప్రభావవంతమైన సాధనం విద్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్య విస్తరణ, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, మౌలిక వసతుల మెరుగుదల, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అనేక కీలక కార్యక్రమాలు అమలు చేశామని వివరించారు.
కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన తాజా పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)లో తెలంగాణ పాఠశాల విద్య పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు పేర్కొనడం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సీఎం అన్నారు. గతంలో జరిగిన విద్యా వ్యవస్థ నష్టాన్ని పూడ్చి విద్యా వికాస పునర్నిర్మాణం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణ విద్యా రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!