

మెదక్ జిల్లాలోని మాసాయిపేట సమీపంలో జాతీయ రహదారి NH-44పై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పి, ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా ఈ బస్సును రిపేర్ చేయించేందుకు హైదరాబాద్ నుంచి మెదక్కు తీసుకువచ్చారు. మరమ్మతులు పూర్తైన అనంతరం ఈ రోజు తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్ బస్సును తిరిగి హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మాసాయిపేట సమీపంలో ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపగా, కొద్ది నిమిషాల్లోనే మంటలు వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో ఇద్దరూ వెంటనే బస్సు నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనాస్థలికి చేరుకుని సుమారు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరమ్మతుల్లో లోపాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!