
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య చమురు రవాణా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చమురు నౌకలు సురక్షితంగా భారత్కు చేరుకుంటున్నాయి. లైబీరియా జెండాతో ఉన్న ‘షెన్లాంగ్’ అనే భారీ చమురు ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రస్ తనూరా పోర్టులో ఈ నెల 1న చమురును నింపుకుని, యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే అక్కడి నుంచి బయలుదేరింది. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కెప్టెన్ సుశాంత్ సింగ్ సంధు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ట్రాన్స్పాండర్లను స్విచ్ఛాఫ్ చేసి నౌకను సురక్షితంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ వ్యూహాన్ని ‘గోయింగ్ డార్క్’గా పిలుస్తారు. చివరికి ఈ నౌక బుధవారం ముంబయి పోర్టుకు చేరుకుని సుమారు ఒక మిలియన్ బ్యారెల్ల చమురును భారత్కు తీసుకొచ్చింది.
ఇదే సమయంలో భారత జెండాతో ఉన్న మరో భారీ వీఎల్సీసీ నౌక ఇరాక్ నుంచి రెండు మిలియన్ బ్యారెల్ల చమురుతో భారత్ వైపు ప్రయాణిస్తోంది. ఈ నౌక ఇప్పటికే భారత జలాల్లోకి ప్రవేశించి త్వరలో ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకోనుంది. ఈ రెండు నౌకల ద్వారా మొత్తం మూడు మిలియన్ బ్యారెల్ల చమురు భారత్కు అందుబాటులోకి రానుంది. యుద్ధ పరిస్థితుల మధ్య కూడా చమురు సరఫరా నిలకడగా కొనసాగుతుండడం దేశానికి ఊరట కలిగిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!