

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. కుంగిన భాగాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, అక్కడ జరుగుతున్న జియోఫిజికల్ మరియు జియోటెక్నికల్ పరీక్షల పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులకు సంబంధించిన పరీక్షలను సీఎం ఒక్కొక్కటిగా పరిశీలించారు. బ్యారేజ్లో పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా మట్టి నమూనాలు సేకరిస్తున్న విధానాన్ని గమనించారు. మొత్తం 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్కు పంపి, ల్యాబ్ పరీక్షల అనంతరం పూర్తి నివేదిక అందనుంది. డ్రోన్ ఆధారిత జీపీఆర్ పరీక్షల ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు నేల స్వభావాన్ని అంచనా వేయవచ్చని అధికారులు వివరించారు. అలాగే సీస్మిక్ టెస్ట్ల ద్వారా బ్యారేజ్ నిర్మాణ స్థితి పై మరింత స్పష్టత లభిస్తుందని తెలిపారు. పరీక్షల అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని, నమూనాల ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలను సరిచేసి ప్రాజెక్టును తిరిగి సక్రమంగా అమలు చేసే దిశగా ముందుకు సాగాలని సీఎం తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు, అలాగే కేంద్ర సంస్థల ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!