

పవిత్ర క్షేత్రం తిరుపతి పరిసరాల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవకోన సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సుమారు రెండు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కాలిపోయింది. మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు మంటలు వేగంగా వ్యాపించాయి. విలువైన వృక్షాలు, వనమూలికలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల కారణంగా వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే కొండ ప్రాంతం కావడం వల్ల వాహనాలు సులభంగా వెళ్లలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గాలి వేగంగా వీచడంతో మంటలు పక్క ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. పూర్తిగా మంటలను ఆర్పడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ధృవీకరించారు.
ప్రాణనష్టం లేకపోయినా అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లింది. ఎండల కారణంగా ఎండిన ఆకులు మంటలు పట్టి ఉండవచ్చు లేదా ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఎర్రచందనం నిల్వలు ఉన్న ప్రాంతం కావడంతో భద్రతను పెంచి ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!