

ఎయిరిండియా కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, ఆదాయాలను పెంచడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా కృత్రిమ మేధ (AI) వినియోగంపై దృష్టి సారించింది. 2022లో టాటా గ్రూప్ ఎయిరిండియాను ప్రభుత్వంనుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత సంస్థను ఆధునీకరించే భారీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ మార్పుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని సంస్థ పేర్కొంది.
ఎయిరిండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ అధికారి సత్య రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం, జెనరేటివ్ AI ఆధారిత వర్చువల్ ఏజెంట్ “AI.g” ద్వారా కస్టమర్ సేవల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. వినియోగదారుల సంప్రదింపుల్లో దాదాపు 50 శాతం వరకు ఈ వ్యవస్థ నిర్వహిస్తోందని, కాల్ సెంటర్ ఖర్చులు కూడా భారీగా తగ్గాయని తెలిపారు. ఉద్యోగుల సహకారం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో కూడా AI సమర్థవంతంగా ఉపయోగపడుతోందన్నారు. పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల అమలులో కూడా జెనరేటివ్ AI సహాయపడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద ప్రెడిక్టివ్, జెనరేటివ్, ఏజెంటిక్ అనే మూడు రకాల AI టెక్నాలజీలు వినియోగంలో ఉన్నట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!