

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తుందని తెలిపారు. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాల్సి ఉండటంతో కొంత ఆలస్యం జరిగిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, రేపు జేఏసీ నాయకులతో చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగాలు తొలగిస్తారనే ప్రచారం అసత్యమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేబినెట్లో ఇప్పటికే చర్చించామని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, ప్రాణాలు తీసుకునే ప్రయత్నాలు బాధాకరమని మంత్రులు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో రేపు కార్మికులతో చర్చలు ఉంటాయని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో సమ్మెల సమయంలో కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామని చెప్పారు. శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగిని హైదరాబాద్కు తరలించి హైదర్గూడా అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. భావోద్వేగాలతో కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!