

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సుమారు 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. ఈ భూమి విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డుల్లో ఉండగా, అందులో 166 ఎకరాలను అటవీ అభివృద్ధి సంస్థకు కేటాయించారు. మిగిలిన 9.05 ఎకరాల భూమిపై కొంతమంది హక్కులు దావి చేస్తుండగా, ఇది ప్రభుత్వ భూమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది.
హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు భూమి స్వరూపాన్ని మార్చకూడదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ, తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని సమతలపరచి లేఅవుట్గా మార్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ప్రీకాస్ట్ గోడలతో భూమిని ఆక్రమించి, కొన్ని స్థలాలను విక్రయించినట్లు కూడా అధికారులు గుర్తించారు. భూ ఆక్రమణ చట్టం ప్రకారం ఆక్రమణలు తొలగించాలని సూచించినా, ఆయన పట్టించుకోలేదు.
రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించింది. అనంతరం భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులను ఏర్పాటు చేసింది. అధికారులు సమక్షంలో ఈ చర్యలు పూర్తయ్యాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!