

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటవీశాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా అడ్డంకులు సృష్టించడం తగదని హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానం వద్ద భక్తులను నిలిపివేయడం వల్ల మరుసటి రోజు తొక్కిసలాట జరిగిన ఘటనను, బద్వేల్లో ఆలయం కూల్చివేత తర్వాత మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితిని ఉదాహరణగా ప్రస్తావించారు. సమస్యలు ఉంటే తన దగ్గరకో, ఉప ముఖ్యమంత్రివద్దకో వచ్చి చెప్పాలని, కానీ స్వేచ్ఛగా వ్యవహరించడం అనుమతించబోమని స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ అటవీశాఖలో మాత్రం మార్పు కనిపించడం లేదని సీఎం అన్నారు.
అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నీరు, విద్యుత్, ఇళ్ల నిర్మాణం, రహదారుల వంటి మౌలిక వసతులపై అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదని పలువురు కలెక్టర్లు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం పరిధిలో బోరుబావులు, గృహ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ పర్యావరణ సంరక్షణతో పాటు అభివృద్ధి కూడా సమానంగా సాగాలని, అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో పెంచిన వెదురును నరికేందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అభివృద్ధిని అడ్డుకోవడం కాదని, ప్రకృతిని కాపాడుతూ ప్రజల ప్రయోజనాలను కూడా పరిరక్షించాలని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!