

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతీ నివాసం వద్ద శనివారం ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన ఇంటికి ఒక్కసారిగా వందల సంఖ్యలో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్విగ్గీ, జొమాటో వంటి యాప్లకు చెందిన డెలివరీ సిబ్బంది పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకోవడంతో స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
శనివారం మధ్యాహ్నం నుంచి మారుతి ఇంటి చిరునామాకు వరుసగా ఫుడ్ డెలివరీ వాహనాలు రావడం మొదలైంది. కేవలం ఆహార పదార్థాలే కాకుండా, కొన్ని మెడికల్ పరికరాలు కూడా ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డర్లన్నీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలో బుక్ చేయడంతో, డెలివరీ సిబ్బంది డబ్బుల కోసం ఇంటి సెక్యూరిటీని సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన వెనుక ప్రభాస్ అభిమానుల పాత్ర ఉండవచ్చన్న అనుమానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభాస్–మారుతి కలయికలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా మేకింగ్, టాక్ విషయంలో కొంతమంది అభిమానులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అదే అసహనానికి నిరసనగా ఇలాంటి విచిత్రమైన చర్యకు పాల్పడ్డారన్న చర్చ నెటిజన్ల మధ్య నడుస్తోంది.
ఈ ఘటన పై దర్శకుడు మారుతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నా ఇంటి వద్ద ఏమి జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. డెలివరీ సిబ్బంది పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆ ఆర్డర్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫేక్ ఆర్డర్ల విషయంలో డెలివరీ యాప్లు మరింత అప్రమత్తంగా ఉండాలి అని ఆయన కోరారు.
ఒక్కసారిగా వందలాది డెలివరీ సిబ్బంది రావడంతో డెలివరీ సంస్థలకు, అలాగే ఆర్డర్లు మోసుకొచ్చిన వారికీ ఆర్థికంగా, మానసికంగా నష్టం వాటిల్లిందని మారుతి ఆవేదన వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!