

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ‘సంకల్ప యాత్ర’ పేరిట తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉన్న తన సినిమా థియేటర్ నుంచి సోమవారం ఉదయం ఈ యాత్రను ఆయన ప్రారంభించారు. సుమారు 460 నుంచి 500 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ, ఇది రాజకీయ యాత్ర కాదని, పూర్తిగా దేవుడికి చేసిన మొక్కు మాత్రమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అభిమానంతోనే తాను నడిచి వెళ్తున్నానని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈ యాత్ర ప్రారంభించానని తెలిపారు.
సినీ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ను చూడాలనే ఆశతో వచ్చానని, అలాంటి చిరంజీవి సినిమా తన థియేటర్లో ప్రదర్శితమవుతున్న సమయంలోనే సంకల్ప యాత్ర మొదలుపెట్టినట్లు బండ్ల గణేష్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన రోజు తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆయనకు బెయిల్ వస్తుందనే నమ్మకంతో ప్రతి కోర్టు విచారణ సమయంలో సుప్రీంకోర్టులో ఉండేవాడినని చెప్పారు. ఆ సమయంలోనే ఆయన ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానని తెలిపారు.
అనంతరం, హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద చంద్రబాబు కోసం మాట్లాడినట్లు గణేష్ గుర్తుచేశారు. ఐటీ రంగానికి చెందిన వారందరితో కలిసి ఆ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. జైలు నుంచి చంద్రబాబు సింహంలా బయటకు వచ్చారని, అది తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. అందుకే నేడు మొక్కు తీర్చుకునే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. ఈ యాత్ర తన ఒక్కడి అడుగు కాదని, ప్రతి తెలుగువాడి అడుగని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!