

ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా భీకర దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. టెహ్రాన్పై జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ను నడిపిస్తున్న కీలక మిలిటరీ లీడర్లు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. అయితే, మరణించిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో ఈ దాడుల గురించి వివరాలు వెల్లడిస్తూ వీడియోలను కూడా పంచుకున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకు ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం అనంతరం ఈ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉండగా, కువైట్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్పై డ్రోన్ దాడి జరగడంతో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
కువైట్ సైన్యం ప్రకారం, దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. మరోవైపు కువైట్ నగరంలోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!