

దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం అనుమతించాలని కోరుతూ అతడి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వైద్యులు కోలుకునే అవకాశం లేదని ధ్రువీకరించిన నేపథ్యంలో, మానవీయ కోణంలో గౌరవప్రదమైన చావును ప్రసాదించాలని కుటుంబం కోరింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఇది అత్యంత సున్నితమైన విషయం అని వ్యాఖ్యానిస్తూ, ఎవరు బతకాలి, ఎవరు చనిపోవాలి అనే నిర్ణయం ఎవరు తీసుకోవచ్చని ప్రశ్నించింది.
ఈ కేసులో ‘కారుణ్య మరణం’ అనే పదాన్ని ఉపయోగించలేమని పేర్కొన్న ధర్మాసనం, ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దిల్లీకి చెందిన హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్న అతడిని తల్లిదండ్రులు ఇంట్లోనే చూసుకుంటున్నారు. 2024లో దిల్లీ హైకోర్టు పిటిషన్ను తిరస్కరించడంతో, తాజా వైద్య నివేదికలతో వారు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13 న తల్లిదండ్రులతో మాట్లాడిన న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకుని, అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!