

తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. దీంతో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమైంది. గత నెలలో తొలి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడతను కూడా విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ విడతలో రాష్ట్రంలోని 45 లక్షలకుపైగా రైతులకు రూ.5,563 కోట్లను జమ చేస్తున్నారు. తొలి విడతలో రూ.3,590 కోట్లు పంపిణీ చేయగా, మూడో విడత నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే నాటికి లబ్ధిదారులందరికీ ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం సొమ్ము అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్యుత్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. అలాగే రైతు రుణమాఫీ కింద లక్షలాది మంది రైతుల ఖాతాల్లో భారీ మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!