

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత K. చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో చర్యలు తీసుకుంటున్నారని, అదే విధానం ఇతర జిల్లాలకు కూడా విస్తరించే పరిస్థితి ఉందని విమర్శించారు. ఇళ్లను ఖాళీ చేయడానికి కూడా సమయం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే, హైడ్రా విధానాన్ని రద్దు చేసే తొలి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మూసీ నది పరిసరాల్లో పేదల ఇళ్లను కూల్చివేయాలనే నిర్ణయం సరికాదని, అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు.
ఈ సభలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్, వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాల మాత్రమే కాకుండా పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల బాధ్యతలు కూడా ఆయనకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. జీవన్రెడ్డి ధైర్యవంతుడు అని, తనతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల కోసం కట్టుబడి పనిచేసే నాయకుడని కొనియాడారు.
ఇక రాష్ట్ర పరిస్థితుల పై మాట్లాడిన కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతు బంధు వంటి పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ సమయంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన కేసీఆర్, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల మద్దతు అవసరమని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!