

చట్ట పరిధిని దాటి వ్యవహరించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూ శివధర్ రెడ్డి డీజీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్తో పాటు, ప్రస్తుతం సీసీఎస్ ఇన్స్పెక్టర్ గోపి, ఎస్సై విఠల్ను సస్పెండ్ చేశారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పుడు కేసులు నమోదు చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం, ఉన్నతాధికారుల నివేదికల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. బాధితులు కోర్టులు, డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కొంతమంది అధికారులు రాజకీయ నేతలకు దగ్గరగా ఉండి సివిల్, భూ తగాదాల్లో తలదూర్చడం, భూముల సెటిల్మెంట్లు చేయడం, నేతలకు నచ్చని వారిపై కేసులు నమోదు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా కొందరి తీరులో మార్పు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్తో పాటు జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోనూ ఇలాంటి ఆరోపణలు ఎక్కువవుతున్నాయి.
ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు సహకరించారన్న ఆరోపణలూ ఉన్నాయి. గతంలో మల్టీజోన్ ఐజీ, నగర పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నప్పటికీ, తాజాగా డీజీపీ స్థాయిలో చర్యలు జరగడంతో శాఖలో ఉలిక్కిపాటు మొదలైంది.
ఇటీవల డీజీపీ అంతర్గతంగా జారీ చేసిన లేఖలో సివిల్ వివాదాలు, పంచాయితీలు, భూ తగాదాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో కొందరు బదిలీల కోసం ప్రయత్నాలు చేయగా, మరికొందరు లూప్లైన్ పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!