

నగదుతో ముడిపడిన ఆన్లైన్ గేమ్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పార్లమెంట్ ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టానికి సంబంధించిన నిబంధనలను తాజాగా నోటిఫై చేసింది. ఈ నిబంధనలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అదే సమయంలో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏ గేమ్ చట్టబద్ధమైనదో, ఏది కాదో నిర్ణయించే అధికారం ఈ అథారిటీకి ఉంటుంది.
రియల్ మనీ గేమ్లు కాకపోతే సాధారణ గేమ్లకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఐటీ శాఖ వెల్లడించింది. అయితే ఈ-స్పోర్ట్స్ గేమ్లు మాత్రం చట్టం ప్రకారం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గేమ్ ఆన్లైన్ మనీ గేమ్ కాదా, సోషల్ గేమ్ లేదా ఈ-స్పోర్ట్స్ గేమ్ అనేది నిర్ణయించడం ఐచ్ఛికమని పేర్కొన్నారు. కానీ అథారిటీ స్వయంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టిన సందర్భాల్లో లేదా కేంద్రం ప్రత్యేకంగా సూచించిన గేమ్లకు మాత్రం నమోదు తప్పనిసరి అవుతుంది.
దేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆరుగురు అధికారులతో అథారిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దీనికి ఛైర్మన్గా వ్యవహరించనుండగా, హోం, ఆర్థిక, సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, న్యాయ శాఖల సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ చర్యలతో ఆన్లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!