
పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి మరింత మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి అదనపు ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అమిత్ షాతో సమావేశమైన సీఎం, పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. 2016 లో మొదటిసారి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన సమీక్ష ఆలస్యంగా 2025 లో జరిగిందని గుర్తుచేశారు. ఆ సమయంలో తెలంగాణకు కేవలం ఏడుగురు ఐపీఎస్లను మాత్రమే కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 83 మంది ఐపీఎస్ అధికారుల సంఖ్యను 105 కు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజధాని పరిధిలో కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్ పాత్ర, సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేస్తున్న పనిని ప్రస్తావించారు. గత రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవనంలో కలిసినట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కూడా కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!