
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికు సన్నిహితుడిగా గుర్తింపబడిన బూనేటి చాణక్య (ఏ-8) తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. మొత్తం 11.29 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలగా, వాటి మార్కెట్ విలువ సుమారు రూ.6.09 కోట్లుగా అంచనా వేశారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో వాటిని కేవలం రూ.1.67 కోట్లకే కొనుగోలు చేసినట్లు చూపించారని అధికారులు తెలిపారు. ఈ కొనుగోళ్లలో ఎక్కువ భాగం నగదు రూపంలోనే చెల్లింపులు జరిగినట్లు సిట్ వెల్లడించింది.
2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో తన ఆదాయం కేవలం రూ.87.09 లక్షలు మాత్రమేనని ఆదాయపు పన్ను రిటర్న్లలో పేర్కొన్న చాణక్య, అదే సమయంలో కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ భూములు ముఖ్యంగా కందుకూరు, మహేశ్వరం, కొత్తూరు, శంషాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అలాగే తాళ్ల అవినాష్ గౌడ్ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు జరిగినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. ఈ వివరాల ఆధారంగా ఆస్తులు మద్యం ముడుపుల సొమ్ముతోనే కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిట్, వాటి జప్తు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!