

ఇథియోపియా లోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 10 వేల సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా పేలింది. విస్ఫోటనం వల్ల భారీగా పొగలు, బూడిద ఆకాశం లోకి ఎగసిపడుతున్నాయి. ఇవి వేల మీటర్ల ఎత్తు వరకు వ్యాపించడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
కేరళ లోని కన్నూరు నుండి అబుధాబీ కి బయల్దేరిన ఒక విమానాన్ని ఈ పరిస్థితుల కారణంగా మధ్యలోనే అహ్మదాబాద్ కు మళ్లించారని విమానయాన అధికారులు తెలిపారు.
అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద ఉత్తర భారతదేశం దాకా చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పౌర విమానయాన శాఖ మరియు వివిధ విమానయాన సంస్థలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ‘ఆకాశ ఎయిర్’ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇథియోపియా లోని అఫర్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఇంతకాలం నిశ్శబ్దంగా ఉండటం, ఇప్పుడు ఒక్కసారిగా విస్ఫోటనం కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచేసింది. ఈ ప్రాంతం జనసాంద్రత తక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం స్పష్టంగా తెలియలేదు. భారీగా వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ ప్రాంతాలకు చేరడంతో అక్కడి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!