

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. సిడం కన్నీబాయి, టేకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయికి చెందిన మూడు ఇందిరమ్మ గృహాలను స్వయంగా ప్రారంభించి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వంశీ కృష్ణ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులతో ముఖాముఖి సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆదివాసీ గూడేల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలో మంజూరైన 4.5 లక్షల ఇళ్లతో పాటు గూడేల కోసం ప్రత్యేకంగా 21 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఏ గూడెంలోనూ ఇల్లు లేని పేద కుటుంబం ఉండకూడదని, వచ్చే ఏడాదికల్లా గూడేల్లో గుడిసెలు కనిపించకుండా చేయాలని అధికారులకు సూచించారు. పిల్లలకు విద్య ఎంతో అవసరమని, చదువే వారి భవిష్యత్తును మార్చగలదని పేర్కొంటూ ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!