

వీసా ఫీజులు పెంచిన తర్వాత, అమెరికా ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ పార్కులను సందర్శించే విదేశీ పర్యాటకులపై ప్రవేశ రుసుములను భారీగా పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే జనవరి 1 నుంచి, యెల్లోస్టోన్, గ్రాండ్ క్యానియన్, యోస్మైట్ వంటి ప్రముఖ పార్కులను సందర్శించే విదేశీయులు ఇప్పటికే వసూల చేస్తున్న $35 వాహన రుసుముకు అదనంగా ఒక్కొక్కరు $100 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త రుసుమును ఇంటీరియర్ సెక్రటరీ డగ్ బర్గమ్ ప్రకటించారు. విదేశీ పర్యాటకుల కోసం వార్షిక పాస్ ధరను కూడా భారీగా పెంచి $250 చేయగా, అమెరికా పౌరులు మాత్రం ఇదే పాస్ను $80కే పొందుతారు.
ఈ “అమెరికా-ఫస్ట్ ప్రైసింగ్” ద్వారా నేషనల్ పార్కుల నిర్వహణకు కావలసిన భారీ నిధులు సమకూరుతాయని అధికారులు చెబుతున్నారు. యెల్లోస్టోన్ పార్క్ ఒక్కదానికే ఈ విధానం ద్వారా ఏటా $55 మిలియన్లు అదనంగా లభించే అవకాశం ఉందని అంచనా.
అయితే పర్యాటక రంగంపై ఆధారపడే వ్యాపారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లేసియర్ నేషనల్ పార్క్ వద్ద ఒక మోటల్ యజమాని చెప్పిన వివరాల ప్రకారం, తన కస్టమర్లలో 15% మంది భారతదేశం, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా వంటి దేశాల నుంచి వస్తుంటారు. వ్యక్తిగతంగా $100 అదనంగా చెల్లించడం వారికి నిరుత్సాహం కలిగిస్తుందని ఆయన అభిప్రాయం.
ఈ పెంపు అకాడియా, జియాన్, బ్రైస్ క్యానియన్, గ్రాండ్ టెటాన్, యోస్మైట్, సెకోయా & కింగ్స్ క్యానియన్, ఎవర్గ్లేడ్స్, రాకీ మౌంటైన్ వంటి అనేక నేషనల్ పార్కుల్లో వర్తిస్తుంది.
ఇక తాజాగా స్టాఫ్లో 25% మందిని తగ్గించిన నేపథ్యంలో, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులపై ఇది మరింత భారం పెడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేషనల్ పార్కులు అందరికీ అందుబాటులో ఉండాలని విమర్శకులు అంటున్నారు.
పూర్తిగా అమలు చేస్తే, ఈ విధానం ద్వారా అమెరికా ప్రభుత్వం ఏటా $1 బిలియన్ వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని టూరిజం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!