

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకులు రవాణా చేసే వ్యవస్థను టీటీడీ ఆధునీకరించింది. గత 35 ఏళ్లుగా ఉపయోగిస్తున్న పాత బ్యాగ్ కన్వేయర్ తరచుగా మరమ్మతులు అవసరం అయ్యే స్థితికి చేరడంతో, భక్తుల భద్రత దృష్ట్యా కొత్త కన్వేయర్ను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారి ఆలయంలోని పోటు కట్టెల పొయ్యులతో కూడిన సంప్రదాయ వంటశాలలో లడ్డూ, వడ, అన్నప్రసాదం వంటి ప్రసాదాలు ప్రతిరోజూ సిద్ధం అవుతాయి. రోజువారీగా 50 నుండి 65 టన్నుల వరకు ముడిసరుకులను ఆలయంలోకి చేరవేయాల్సి ఉంటుంది. మహాద్వారం ద్వారా ఈ సరుకులను తరలిస్తే భక్తులకు ఇబ్బందులు కలగడం సహజం.
ఈ సమస్యను తగ్గించేందుకు గత మూడు దశాబ్దాలుగా ఆలయం వెనుకభాగంలోని ఉగ్రాణం నుంచి కన్వేయర్ ద్వారా ముడిసరుకులు ప్రాకారం మీదికి పంపించే విధానం కొనసాగుతోంది. అప్పట్లో చెన్నైకి చెందిన ఒక సంస్థ ఈ కన్వేయర్ను విరాళంగా అందించింది. చిన్నపాటి మూటలను కన్వేయర్పై ఉంచితే అవి 40 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాకారానికి చేరతాయి. అక్కడి సిబ్బంది వాటిని తీసుకుని ప్రసాదాల తయారీలో వినియోగిస్తారు.
అయితే పాత కన్వేయర్ బాడీ పూర్తిగా బలహీనపడడంతో ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని టీటీడీ గుర్తించింది. కన్వేయర్ కింద నుంచే భక్తులు రాకపోకలు సాగించే కారణంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు.
ఒక దాత సహాయంతో నాగ్పూర్లో తయారు చేసిన కొత్త బ్యాగ్ కన్వేయర్ను తిరుమలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం నిపుణులు దీనిలోని హైడ్రాలిక్ సిస్టమ్, బాడీ, భద్రతా అంశాలను పరీక్షిస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక, ఇంకా రెండు–మూడు రోజుల్లో ఈ కొత్త కన్వేయర్ను పూర్తిగా ఉపయోగంలోకి తెస్తామని టీటీడీ తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!