

తిరుమలలో ప్రతిరోజూ లక్ష మందికిపైగా భక్తులకు అన్నదానం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న ఈ అన్నదాన పథకంలో భక్తులు తమ ఇష్టానుసారంగా విరాళాలు అందించవచ్చు. రూపాయి నుంచి కోటి రూపాయల వరకు, అంతకంటే ఎక్కువగా కూడా విరాళం ఇచ్చే అవకాశం ఉంది. ఒకరోజు మొత్తం భక్తులకు అన్నదానం చేయాలంటే రూ.44 లక్షలు విరాళంగా ఇవ్వాలి. ఇందులో అల్పాహారానికి రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి మరో రూ.17 లక్షలు కేటాయించారు.
విరాళం మొత్తాన్ని బట్టి భక్తులకు ప్రత్యేక దర్శనాలు, వసతి, ప్రసాదాలు, ఆశీర్వచనాలు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. రూ.1 నుంచి రూ.5 లక్షల విరాళం ఇస్తే, అయిదుగురికి ఏడాదిలో మూడు రోజుల పాటు సుపథం దర్శనం, రూ.100 గదిలో వసతి, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు, దుపట్టా, జాకెట్ ముక్క అందిస్తారు. రూ.10 నుంచి రూ.25 లక్షల విరాళానికి బిగినింగ్ బ్రేక్ దర్శనం, రూ.1000 గది, అదనపు ప్రసాదాలతో పాటు 50 గ్రాముల వెండి కాయిన్ ఇస్తారు.
రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల విరాళానికి బిగినింగ్ బ్రేక్ దర్శనం, ఒక రోజు సుపథం దర్శనం, రూ.1500 గది, పెద్ద లడ్డూలు, చిన్న లడ్డూలు, 5 గ్రాముల బంగారు డాలర్, వెండి కాయిన్ అందిస్తారు. రూ.50 నుంచి రూ.75 లక్షల విరాళం ఇస్తే సుప్రభాత సేవకు అవకాశం, మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం, రెండు రోజులు సుపథం దర్శనం, మెరుగైన వసతి కల్పిస్తారు. రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు విరాళం ఇస్తే రెండు రోజుల సుప్రభాత సేవ, వేద ఆశీర్వచనం, అధిక ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి కాయిన్ ఇస్తారు. కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే మరింత విస్తృతంగా ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!