

తెలంగాణలో మరోసారి వాతావరణం మారబోతోంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం గంటల్లో పొడి వాతావరణం, ఎండ తాకిడి కనిపించవచ్చని అధికారులు చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై, సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం తక్కువగానే ఉన్నా, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రెండు గంటల్లో యాదాద్రి-భువనగిరి, జనగామ, నల్గొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో చిరుజల్లులు పడవచ్చని అంచనా.
ఇక ఈ ఏడాది రుతుపవనాల కాలంలో తెలంగాణలో వర్షాలు చరిత్ర సృష్టించాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణం కంటే 33% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు రికార్డులను తిరగరాసాయి. ‘మొంథా’ తుఫాను ప్రభావంతో అక్టోబర్లోనే 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది — ఇది సాధారణ సగటు కంటే 96% అధికం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో కేవలం 24 గంటల్లో 422 మిల్లీమీటర్ల వర్షం పడటం రికార్డుగా నిలిచింది.
అధికారులు ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.











కామెంట్స్ (2)
తెలంగాణలో వాతావరణం మళ్లీ మారబోతోంది!
Rainy days again!