

పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు దారి తప్పుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా ఉన్న పెన్షనర్లను గుర్తించి పెన్షన్లు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సోషల్ ఆడిట్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ ఆడిట్ ప్రక్రియలో వేలాది పెన్షన్లు అనర్హులకు అందుతున్నట్టు తేలింది. ధనవంతులు, 50 ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకపోయినా దివ్యాంగులుగా నమోదు చేసుకున్నవారు, అలాగే మరణించిన వారి పేర్ల పై ఇతరులు పెన్షన్లు పొందుతున్న ఘటనలు బయటపడ్డాయి. దీంతో వీరందరి పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మొదటి దశగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ను నాలుగు జిల్లాల్లో అమలు చేసింది. ఈ జిల్లాల్లో సుమారు 20 వేల పెన్షన్ కేసులను శాంపిల్గా పరిశీలించగా, అందులో దాదాపు 2 వేల మంది అనర్హులుగా గుర్తించబడ్డారు. ఇది ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేసింది.
సోషల్ ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అక్రమాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు, ఈ ప్రక్రియను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సహాయం చేరేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!