

దావోస్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కలిశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ ఒక ఉత్తమ వేదిక అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీని బ్రాండ్ చేయడానికీ, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికీ ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
2025 దావోస్ పర్యటనలో జరిగిన చర్చల ఫలితంగా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు అమలులోకి వచ్చాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఎఐ, అగ్రికల్చర్, టూరిజం రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని వివరించామని తెలిపారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆసక్తి గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సమావేశంలో విశాఖలోని టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం వ్యాలీ, కర్నూలు సోలార్ ప్రాజెక్టులు, టాటా గ్రూప్ టూరిజం ప్రాజెక్టులు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అలాగే రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీల నిర్మాణ ప్రతిపాదనలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భరోసా ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!