

మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
మీడియాతో మాట్లాడిన జుయల్ ఓరం, సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలుస్తోందని, ఇది గిరిజనుల మహాకుంభమని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు అందిస్తోందని, జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, తెలంగాణకు మంజూరైన ఏకలవ్య పాఠశాలల వివరాలను వెల్లడించారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు జాతరకు హాజరవుతారని తెలిపారు. ములుగు ప్రాంత పర్యాటకాభివృద్ధి, రామప్ప దేవాలయ అభివృద్ధి, జాతర నిర్వహణకు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. సమ్మక్క–సారక్క పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!