

ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు సహాయం చేసేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. విమాన ప్రయాణికుల కోసం శనివారం నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనపు బోగీలను కూడా జత చేసింది. ప్రత్యామ్నాయ రవాణా అవకాశాలు తక్కువగా ఉండటంతో, అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.
సెంట్రల్, వెస్టర్న్, నార్త్ వెస్టర్న్, ఈస్టర్న్ రైల్వే జోన్లలో అనేక ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. పుణే–బెంగళూరు, పుణే–ఢిల్లీ, ముంబై–న్యూఢిల్లీ, ముంబై–గోవా, లఖ్నౌ–ముంబై, నాగ్పూర్–ముంబై, గోరఖ్పూర్–ముంబై రూట్లలో అదనపు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హౌరా–న్యూఢిల్లీ రూట్లో డిసెంబర్ 6న బయలుదేరి 8న తిరిగి వచ్చే ప్రత్యేక రైలు నడపబడింది. అలాగే, ముంబై–మడ్గావ్ రూట్లో డిసెంబర్ 7న మరో ప్రత్యేక రైలు ప్రవేశపెట్టబడింది. హాలిడే మరియు వారాంతపు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పటికే నడుస్తున్న రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా రైల్వే శాఖ అదనపు కోచ్లను జోడించింది. బెంగళూరు–అగర్తల హమ్సఫర్ ఎక్స్ప్రెస్, మంగళూరు–తిరువనంతపురం ఎక్స్ప్రెస్, బెంగళూరు–చెన్నై ఎక్స్ప్రెస్లకు అదనపు ఏసీ బోగీలను జత చేసింది. మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు చేరగా, 114 ట్రిప్పుల్లో అదనపు సీట్ల సౌకర్యం ఏర్పడింది. రోజుకు 35 వేల మంది అదనపు ప్రయాణికులను రవాణా చేస్తున్నామని అధికారులు తెలిపారు. డిమాండ్ ఉన్న రూట్లలో పూర్తిగా ఏసీ కోచ్లతో ప్రత్యేక రైళ్లు నడపడం కూడా పరిశీలనలో ఉందని, విమాన రద్దుల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ప్రయాణికుడికి రవాణా సౌకర్యం అందించడం తమ లక్ష్యమని రైల్వే శాఖ స్పష్టంచేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!