

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై 14 రోజుల పాటు జరిగిన కస్టడీ విచారణ ముగిసింది. ఈరోజు (శుక్రవారం) ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, పరీక్షల అనంతరం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ కేసులో సిట్ అధికారులు ప్రభాకర్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేసి, తుది ఛార్జ్ షీట్లో చేర్చనున్నారు. ఈ విషయంపై జనవరి 16 న సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. దీంతో ఈ కేసు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
మొదటి దశలో డిసెంబర్ 12 నుంచి 18 వరకు సిట్ బృందం ప్రభాకర్ రావును విచారించింది. అయితే ఆయన పూర్తి సహకారం ఇవ్వలేదని, ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. దీంతో సుప్రీంకోర్టు అనుమతితో డిసెంబర్ 19 నుంచి 25 వరకు మరోసారి కస్టడీ విచారణ చేపట్టారు. మొత్తం 14 రోజుల పాటు విచారణ కొనసాగింది. ఈ కేసులో తిరుపతన్నరావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వంటి ఇతర నిందితులను కూడా సిట్ అధికారులు వేర్వేరుగా విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.
విచారణలో, ఎస్ఐబీ చీఫ్గా ఉన్న సమయంలో అప్పటి మంత్రి హరీష్ రావును ఎందుకు కలిశారని ప్రశ్నించగా, ఆయనకు ప్రాణహానీ ఉందని తెలిసి భద్రత కోసం మాత్రమే కలిసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. పదవీ విరమణ అయినప్పటికీ పదవిలో కొనసాగడంపై ప్రశ్నించగా, అప్పటి సీఎం కేసీఆర్కే ఈ విషయం తెలుసని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్లను కూడా విచారించే అవకాశముందని తెలుస్తోంది. ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. గతంలో వేల సంఖ్యలో ఫోన్ నంబర్లను ట్యాప్ చేసి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో, సిట్ బృందం జనవరి 16 లోపు పూర్తి నివేదిక సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!