

సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలు, భారీ తగ్గింపు ఆఫర్లు, ఆరోగ్య చిట్కాల పేరుతో జరుగుతున్న మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. డబ్బుల కోసం కొందరు ప్రభావశీలులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వాటిని గుడ్డిగా నమ్మి ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా నష్టపోవద్దని సూచించారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమ పందేల ప్రకటనలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని హెచ్చరించారు.
ప్రస్తుతం నకిలీ ప్రకటనలకు సామాజిక మాధ్యమ వేదికలు ప్రధాన కేంద్రాలుగా మారాయని అధికారులు పేర్కొన్నారు. అక్రమ పందేలు, తప్పుడు పెట్టుబడి పథకాలు, ఆధారాలు లేని ఆరోగ్య ఉత్పత్తులు, అసత్య హామీలతో కూడిన భూవ్యాపార ప్రకటనలు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. కొనుగోలు లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలు సేకరించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
కృత్రిమ మేధ సాంకేతికత సహాయంతో నకిలీ చిత్రాలు సృష్టించి సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులను ప్రచారం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వ్యాధులను నయం చేస్తామని చేసే ప్రకటనలను నమ్మరాదని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడం, ముఖ్యంగా వృద్ధులకు ఈ మోసాల గురించి వివరించడం ద్వారా మాత్రమే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!