

వేసవికాలం ప్రారంభమైన వెంటనే మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. భారతదేశంలో బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, అల్ఫోన్సా, కేసర్ వంటి ఎన్నో రకాల మామిడిపండ్లు విస్తృతంగా లభిస్తాయి. సహజంగా మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా పండ్లు కార్బైడ్ వంటి రసాయనాలతో త్వరగా పండించినవిగా మారాయి. పండ్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు వ్యాపారులు ఈ రసాయనాలను వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ రసాయనాలు క్యాన్సర్, సంతానలేమి, పీసీఓఎస్ వంటి సమస్యలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. గతంతో పోలిస్తే సంతానలేమి సమస్యలు పెరుగుతుండగా, ఊబకాయం, పీసీఓఎస్ వంటి సమస్యలు టీనేజ్ బాలికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పీసీఓఎస్ కారణంగా నెలసరి సమస్యలు, జుట్టు రాలడం, మొటిమలు, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కార్బైడ్ వంటి రసాయనాలు మెదడు కణాలపై కూడా ప్రభావం చూపి పిల్లలు, గర్భిణీలు, పెద్దల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అందుకే రసాయనాలతో పండిన పండ్లను గుర్తించడం చాలా ముఖ్యం.
సహజంగా పండిన మామిడిపండ్లకు తీపి వాసన, సహజమైన రంగు, రుచికరమైన గుజ్జు ఉంటాయి. కానీ కార్బైడ్తో పండించిన పండ్లలో వాసన తక్కువగా ఉండటం, బయట పసుపు రంగులో కనిపించి లోపల పచ్చగా ఉండటం, రుచి సహజంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఒకటి కాకుండా రెండు మూడు లక్షణాలు కలిపి పరిశీలించడం అవసరం. వీలైతే స్థానిక రైతుల వద్ద నుంచి పండ్లు కొనడం మంచిది. మార్కెట్లో కార్బైడ్ పండ్లు గుర్తించినప్పుడు వాటిని కొనకుండా ఉండటంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండటంతో, రసాయన రహిత మామిడి పండ్లను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!