

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ ఏడాది అత్యంత ఘనంగా, చరిత్రలో నిలిచేలా విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తెలిపారు. కోట్లాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తల్లులను దర్శించుకోవడం ప్రభుత్వ యంత్రాంగం సాధించిన ముఖ్యమైన విజయమని ఆమె పేర్కొన్నారు. తల్లుల వన ప్రవేశం అనంతరం మేడారంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ముందుగానే రూపొందించిన ప్రణాళికలు, స్పష్టమైన వ్యూహాలు, శాఖల మధ్య సమన్వయం వల్ల జాతర ఎక్కడా అంతరాయం లేకుండా సాగిందని చెప్పారు. రవాణా, వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, అగ్నిమాపక, పోలీస్ భద్రత వంటి అన్ని విభాగాలు సమర్థంగా పనిచేశాయని తెలిపారు.

ఈ ఏడాది జాతరలో చేపట్టిన నూతన అభివృద్ధి పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మంత్రి సీతక్క అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణాలను మరింత సౌకర్యవంతంగా, అందంగా తీర్చిదిద్దడంతో భక్తులకు మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. గద్దెల పరిసరాల విస్తరణ, పాదచారుల మార్గాలు, శాశ్వత మౌలిక వసతులు జాతర ప్రతిష్టను మరింత పెంచాయని తెలిపారు. సంప్రదాయం, ఆధునిక సదుపాయాలు సమన్వయమై మేడారం మహాజాతరకు మరింత శోభ తీసుకువచ్చాయని, ఇవి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ మహాజాతరను విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సేవకులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గుడి అభివృద్ధి పనులపై కొందరు దుష్ప్రచారం చేసినా భక్తులు వాటిని పట్టించుకోకుండా తల్లుల సేవలో పాల్గొన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వంద రోజుల్లోనే అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మేడారం చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!