

మావోయిస్టు పార్టీ కార్యకలాపాలలో కీలక మలుపు రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తమ సభ్యులందరూ ఆయుధాలు వదిలి లొంగిపోతారని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదలైన లేఖలో వెల్లడించారు. ఇటీవల టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడం వంటి పరిణామాలు పార్టీని బలహీనపరిచాయి. కేంద్రం పలుమార్లు లొంగుబాటు చేయాలని కోరడం తో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వమే తమకు ప్రాధాన్యతనిస్తోందని భావించి అధికారుల ముందు ఆయుధాలు సమర్పించడానికి సిద్ధమయ్యామని వారు స్పష్టం చేశారు.
ఆయుధాలు వదులుకోవడం ప్రజల పట్ల ద్రోహం కాదని అనంత్ వ్యాఖ్యానించారు. మావోయిస్టు చట్రాన్ని అణచివేయడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రస్తుతం తీవ్రంగా కొనసాగుతోంది. దాంతో, అడవుల్లో మావోయిస్టుల కదలికలు భారీగా తగ్గిపోయాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా పలువురు ముఖ్య నాయకులు మరణించడంతో వారి బలగాలు మరింత చీలిపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, మావోయిస్టు పార్టీ అంతర్గతంగా ఆయుధ విరమణ పై చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల విడుదల చేసిన వీడియో లో కూడా ఉద్యమం తన దిశ కోల్పోయిందని, ప్రాణాలు కోల్పోతున్న వారి పట్ల తనకు బాధగా ఉందని తెలిపారు. దేశ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో మావోయిస్టులు కూడా లొంగిపోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు పీడితుల హక్కుల కోసం మొదలైన పీపుల్స్ వార్ ఉద్యమం, కాలక్రమేణా పోలీసులతో జరిగిన ఎదురు దాడుల వరకే పరిమితమైపోయింది. గత రెండు సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టుల శక్తి దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. పలువురు నేతలు లొంగిపోవడం, మరికొందరు ఎన్కౌంటర్లలో మరణించడం వల్ల ఉద్యమం చివరి దశకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో, వచ్చే జనవరి ఒకటో తేదీ నుండి అధికారికంగా ఆయుధ విరమణ చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!