

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సదుపాయాలతో, దీర్ఘదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ రైలు త్వరలో కోల్కతా – గువాహటి మార్గంలో పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ రైలుకు సంబంధించిన ఛార్జీలు, బుకింగ్ నిబంధనలను రైల్వే శాఖ నోటిఫై చేసింది. ఈ రైలులో కనీస ఛార్జీ రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3 ఏసీ టికెట్కు ఈ ఛార్జీ వర్తిస్తుంది. అంటే, ప్రయాణికుడు 400 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి టికెట్ బుక్ చేసినా ఇదే కనీస ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 3,500 కిలోమీటర్ల ప్రయాణానికి 1 ఏసీ ఛార్జీ రూ.13,300 గా నిర్ణయించారు.
కిలోమీటర్ వారీగా కనీస టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. 3 ఏసీకి కిలోమీటరుకు రూ.2.4 చొప్పున రూ.960, 2 ఏసీకి కిలోమీటరుకు రూ.3.1 చొప్పున రూ.1,240, 1 ఏసీకి కిలోమీటరుకు రూ.3.8 చొప్పున రూ.1,520 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ దూరాన్ని బట్టి ఈ ఛార్జీలు పెరుగుతాయి. ఈ వందేభారత్ స్లీపర్ రైలులో కన్ఫామ్ టికెట్ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఇందులో ఆర్ఏసీ (RAC) సౌకర్యం ఉండదు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారు లేదా పాక్షికంగా కన్ఫామ్ అయిన ప్రయాణికులను ఈ రైలులో అనుమతించరు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ అయిన 60 రోజుల ముందే అన్ని బెర్తులు బుకింగ్కు అందుబాటులో ఉంటాయి.
ఈ రైలులో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కోటా ఉంటుంది. ఇతర కోటాలకు అవకాశం ఉండదు. టికెట్లు పూర్తిగా డిజిటల్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు 24 గంటల్లో రిఫండ్ అందే విధంగా ఏర్పాట్లు చేశారు. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్ల అందుబాటును బట్టి లోయర్ బెర్తులను సిస్టమ్ ఆటోమేటిక్గా కేటాయిస్తుంది. ఈ రైలులో పూర్తి ఎయిర్ కండీషన్తో కూడిన 3 ఏసీ, 2 ఏసీ, 1 ఏసీ బోగీలు ఉంటాయి. రైలు టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు కాగా, ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఆటోమేటిక్ స్లయిడింగ్ డోర్స్, ఆధునిక టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలు, ప్రమాదాల నివారణ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!