

ముంబయిలో నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యతను స్పష్టంగా వివరించారు. ప్రపంచ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ కీలకమని, తెలంగాణలో పునరుత్పాదక శక్తికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పంప్సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈ విద్యుత్ ఉత్పత్తిని బొగ్గు వంటి సంప్రదాయ వనరుల నుంచి సోలార్ మరియు ఇతర గ్రీన్ ఎనర్జీ వనరుల వైపు మళ్లించడం తమ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడం, కార్బన్ ఫుట్ప్రింట్ ఆడిట్ చేపట్టే తొలి భారత నగరంగా నిలపడం తమ సంకల్పమని స్పష్టం చేశారు. అలాగే కోర్ అర్బన్ రీజియన్ (CURE)లో వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
భారత అభివృద్ధి ప్రయాణాన్ని విశ్లేషిస్తూ, 1947 తర్వాత తొలి దశాబ్దాల్లో విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. గ్రామీణ పాఠశాలల నుంచి IIT, IIM, IISc వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఏర్పడటం, భారీ ఆనకట్టల నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. 1991 తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలతో భారత్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, టెలికాం మరియు సాఫ్ట్వేర్ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాలు విస్తరించాయని వివరించారు. అయితే ఈ ప్రగతిలో తయారీ రంగం తగినంత అవకాశాలు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ అనంతరం అభివృద్ధి వ్యూహంలో తయారీ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత కీలకమయ్యాయని, ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పత్తి అసలైన బలం అని చెప్పారు. తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధిని CURE, PURE, RARE జోన్లుగా విభజించి వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ORR పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), ORR–RRR మధ్య ప్రాంతాన్ని తయారీకి కేటాయించిన PURE జోన్గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా తీర్చిదిద్ది “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 16,610 మెగావాట్లు కాగా, భవిష్యత్తులో ఇది 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. సుమారు 25 శాతం విద్యుత్ గ్రీన్ వనరుల నుంచే వస్తోందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు, మెట్రో విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోరిక్షాల రీట్రోఫిటింగ్, మూసీ నది పునరుద్ధరణ, సరస్సుల సంరక్షణ, హైడ్రా ఏర్పాటు వంటి చర్యల ద్వారా హైదరాబాద్ను పర్యావరణహిత, సురక్షిత, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!