

హైదరాబాద్ నగర భద్రతను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ప్రజా సమస్యలు వచ్చిన వెంటనే స్పందించేలా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం అర్ధరాత్రి సీపీ సజ్జనార్ సౌత్ వెస్ట్ జోన్లో ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12 నుంచి ఉదయం 3 గంటల వరకు లంగర్హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎలాంటి సైరన్ లేకుండా, సాధారణ వాహనంలోనే పర్యటిస్తూ, లంగర్హౌస్ పీఎస్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు.
ఇళ్లలో ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై విచారించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు. నేర మార్గం విడిచి సన్మార్గంలో నడవాలని వారికి సూచించారు.
అదేవిధంగా టోలిచౌకి పరిధిలో రాత్రి వేళల్లో తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, వ్యాపార కేంద్రాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రాత్రివేళ వ్యాపారం కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.
పెట్రోలింగ్ బృందాలు ఎంతమేర అప్రమత్తంగా ఉన్నాయో, రాత్రి సమయంలో ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు ఏవో ప్రత్యక్షంగా పరిశీలించారు. వీధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను కలసి గస్తీ పాయింట్లు, భద్రతా చర్యలు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.
తర్వాత టోలిచౌకి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి ఎంట్రీలు, హాజరు రిజిస్టర్, సిబ్బందికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, విజిబుల్ పోలీసింగ్ అత్యంత ముఖ్యమని, నగరంలో నేరాలపై శక్తివంతమైన పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ప్రజా సమస్యలకు వెంటనే స్పందించేలా ప్రతి పోలీస్ బృందం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!