

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరియు బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పీల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, రూ.15 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు పలు షరతులతో బెయిల్ ఇస్తూ, అప్పీల్ తేలే వరకు శిక్షను నిలిపివేసింది. సెంగర్ ఇప్పటికే ఏడేళ్లు శిక్ష అనుభవించిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అయితే, సెంగర్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందని, బాధితురాలి భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని సీబీఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సీబీఐ శనివారం ప్రకటించింది.
2017లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి మైనర్ బాలికపై సెంగర్ అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో, 2018 డిసెంబర్లో ట్రయల్ కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. బెయిల్ మంజూరుపై బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీని బాధితురాలు కలిసి తన బాధను తెలియజేస్తూ, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. నిందితుడికి బెయిల్ రావడం తమ కుటుంబానికి మరణశాసనమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!