

ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ప్రారంభించింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామక ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. మొత్తం పోస్టులు సుమారు 3,600 వరకు ఉండే అవకాశం ఉంది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సంక్షేమ శాఖ పాఠశాలల్లో కలిపి దాదాపు 1,200 ఖాళీలు ఉండగా, పంచాయతీరాజ్, పురపాలక మరియు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1,700 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల కోసం మరో 700 పోస్టులు ఉండే అవకాశముంది.
ఈసారి డీఎస్సీ సిలబస్లో ఎలాంటి మార్పులు చేయకుండా గతేడాది అమలు చేసిన సిలబస్, మార్గదర్శకాలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పోస్టులకు ఆంగ్ల భాష మరియు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉన్నప్పటికీ, సమయం లేకపోవడంతో వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న సుమారు 2,600 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల్లో అర్హతలు కలిగిన దాదాపు 800 మందికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. అయితే శాశ్వత ఉద్యోగాల కోసం వీరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రత్యేక డీఎస్సీలో ఒప్పంద ఉపాధ్యాయులకు వెయిటేజీ ఇవ్వాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!