

దేశంలోని ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఈసారి తన ప్రతిష్టాత్మక అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రకటించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు, అలాగే పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంలో సాధించిన విజయానికి గానూ ఆయనను ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ అవార్డును మార్చి నెలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనున్నారు.
ఈ ఎంపికను దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ చేసింది. ఈసారి జ్యూరీలో భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది.
ఈ అవార్డును గతంలో అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), దేవేంద్ర ఫడణవిస్ (2019), అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి ప్రముఖులు అందుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కిన సందర్భంగా రాజకీయ, పారిశ్రామిక వర్గాలు, మంత్రి వర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!