

రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటలకు నిర్వహించే మహాపూజలతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా హస్తిన మడుగు నుంచి కాలినడకన తీసుకొచ్చిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడం ద్వారా జాతర అంకురార్పణ జరుగుతుంది.
ఈ అపూర్వ పండుగను వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ నెల 20 న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి అనుమతి ఉండదు. అదేరోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజలు, మహిళలు విశేషంగా పాల్గొనే భాన్ దేవత పూజలు జరుగుతాయి. 22 న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తారు. అనంతరం 23 న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో సంప్రదాయ పూజలు ముగిసినా, భక్తుల రద్దీ మాత్రం ఈ నెల 25 వరకు కొనసాగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!